కేసులుంటే స్వీపర్‌ కొలువూ రాదు..కానీ మంత్రులు కావొచ్చు

 

  • నేరాభియోగాలున్న వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలి
  • సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం
  • కేంద్రం, ఈసీకి సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ :

అవినీతికి సామాన్య మానవుడు బలవుతున్నాడని, ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా లంచం ఇవ్వనిదే పని జరగడం లేదంటూ సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అవినీతిని రూపుమాపాలంటే అన్నిస్థాయుల్లో జవాబుదారీతనాన్ని తేవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. క్రిమినల్‌ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న వారిని ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) విచారణ సందర్భంగా జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్న ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పిల్‌ను దాఖలు చేసిన న్యాయవాది అశ్విన్‌ ఉపాధ్యాయ్‌ తన వాదనలు వినిపిస్తూ ‘‘వేధింపులు, హత్య, అపహరణ లాంటి నేరాలకు పాల్పడిన వ్యక్తి ప్రభుత్వ కార్యాలయంలో స్వీపర్‌ లేదా పోలీస్‌ కానిస్టేబుల్‌ కూడా కాలేడు. కానీ అవే నేరాలు చేసిన వ్యక్తి మాత్రం మంత్రి కావొచ్చు’’ అని పేర్కొన్నారు. ఈ పిల్‌పై స్పందన తెలపాల్సిందిగా కేంద్రం, ఎన్నికల సంఘానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest