తెలంగాణకు మొండిచేయి: రేవంత్ రెడ్డి

న్యూ ఢిల్లీ :

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఐదో బడ్జెట్ తీవ్ర నిరాశపరిచింది. రూ. 45 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. పార్లమెంటు వేదికగా విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే ఫ్యాక్టరీ, ఏదైనా సాగు నీటీ ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి అంశాలను బడ్జెట్లో విస్మరించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐటీఆర్ ప్రాజెక్ట్ ప్రస్తావన లేదు. 2019 ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, ప్రతి పేదవాడి ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. 2014 ఎన్నికల సందర్భంగా ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చారు. ఇందులో ఏ ఒక్క హామీని నేరవేర్చలేదు. ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు లెక్కన ఈ 9 ఏళ్లలో 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. అందులో తెలంగాణ రాష్ట్రానికి 75 లక్షల ఉద్యోగాలు దక్కాల్సి ఉంది. గత పార్లమెంటు సమావేశాల్లో నేను అడిగిన ప్రశ్నకు వివిధ ఉద్యోగాల కోసం నిరుద్యోగుల నుంచి 22 కోట్ల దరఖాస్తులు వస్తే 7 లక్షలు ఉద్యోగాలు ఇచ్చినట్లు పేర్కొంది. దీన్ని బట్టి ఉద్యోగ, ఉపాధి కల్పనలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. రైతుల ఆదాయం సంగతి ఏమోగానీ పెట్టుబడి మాత్రం రెండింతలైంది. దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి దాపురించింది.
2014 ఎన్నికల సందర్భంగా మహబూబ్ నగర్ పర్యటనలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రస్తావించారు. కానీ ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. అన్ని రకాలుగా కేంద్రం తెలంగాణకు మొండి చేయి చూపించింది. ఎన్నికలు జరుగుతున్న కర్ణాటక రాష్ట్రానికి మాత్రం నిధులు కేటాయించింది. కానీ తీవ్రమైన వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తెలంగాణ పట్ల మాత్రం కేంద్రం వివక్ష చూపింది. కరోనా కాలంలో అదుకున్న ఉపాధి హామీ పథకానికి నిధులను, పనిదినాలను కేంద్రం తగ్గించింది. పేదల పట్ల ఈప్రభుత్వానికి ఎలాంటి ప్రేమ, పట్టింపు లేదు. ఏరకంగా చూసినా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ను కాంగ్రెస్ ఖండిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అండగా నిలబడింది. బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి బీజేపీ, బీఆరెస్ ఇద్దరు దోషులే. మోదీ, కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలు తెలంగాణకు అన్యాయం చేశారు. ఇప్పటికైనా తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలి. రాష్ట్రంలో ప్రతీ పేదవాడికి ఇళ్లు నిర్మించేందుకు అవసరమైన నిధులను కేంద్రం కేటాయించాలి. రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించాలి. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రక్రియను మొదలు పెట్టాలి.
మోదీ గారు మీరు గుజరాత్ కు బుల్లెట్ ట్రైన్, అవసరమైన నిధులు తీసుకుపోతారు. మోదీగారు మీరు గుజరాత్ కు సీఎం కాదు.. ఈ దేశానికి ప్రధాని. నిధుల కేటాయింపులో గుజరాత్ కు కల్పించిన ప్రాధాన్యతను తెలంగాణకు కల్పించండి. మోదీ అన్యాయం చేస్తుంటే.. నిలదీయాల్సిన బీఆరెస్.. సభలో నిస్సహాయంగా నిలబడింది. అవినీతిని కప్పి పుచుకోవడానికే.. కేసీఆర్ కేంద్రంతో కాళ్లబేరానికి దిగాడు. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం ద్వారా చేసిన పాపాన్ని కడుక్కోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది కానీ నిధులు రాబట్టేందుకు చొరవ చూపడం లేదు. పార్లమెంటు వ్యవస్థ మీద సంపూర్ణ విశ్వాసం కలిగిన మోదీ..పార్లమెంటు సాక్షిగా తెలంగాణ అభివృద్ధి కోసం పునర్విభజన చట్టంలో చేసిన హామీలను ఎందుకు విస్మరిస్తున్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సవరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది.
ఫిబ్రవరి 6 న ములుగు నుంచి సమ్మక్క సారక్క నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభమవుతుంది. జాతీయ స్థాయి నాయకత్వం కూడా వివిధ సందర్భాలలో ఈ యాత్రలో పాల్గొంటుంది. మొదటి విడతగా 60 రోజులు.. 40 నుంచి 50 నియోజకవర్గాల్లో ఈ యాత్ర చేయాలనుకుంటున్నాం. ఆ తరువాత కొనసాగించే విషయం పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest