హైదరాబాద్:
ప్రీతి మృతిపై సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లుగా మంత్రి ఎర్రబెల్లి ప్రకటించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామన్నారు. రాష్ట్ర మంత్రులు, రేవంత్రెడ్డి, డీకే అరుణ ప్రీతి మృతికి సంతాపం తెలిపారు.
ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
బాధిత కుటుంబానికి అండగా ఉంటుందన్నారు. పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. 5 రోజులుగా నిమ్స్ వైద్యుల చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రాత్రి 9 గంటల 10 నిమిషాలకు ప్రీతి చనిపోయిందని… నిమ్స్ వైద్యులు ప్రకటించారు. ఈ నెల 22న కేఎంసీలో సీనియర్ వేధిస్తున్నాడని.. ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది. వైద్య విద్యార్థినీ ప్రీతి మృతిపై విచారం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ విచారణలో తేలిన దోషుల్ని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లుగా మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. వైద్య విద్యార్థిని మృతిపై రాష్ట్ర మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాఠోడ్, గంగుల కమలాకర్, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సంతాపం తెలిపారు. ప్రీతిని కాపాడేందుకు నిమ్స్ వైద్యులు శక్తివంచన లేకుండా కృషి చేశారన్న మంత్రి హారీశ్రావు విద్యార్థినీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ప్రీతి మృతి అత్యంత బాధాకరమని హరీశ్రావు అన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.సీఎం ఆదేశాల మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రీతి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రీతి ఘటన అత్యంత బాధాకరమని నిందితుడిని ఎట్టి పరిస్థితులలో వదిలిపెట్టబోమని మంత్రులు సత్యవతి రాఠోడ్, గంగుల కమలాకర్ వెల్లడించారు. మృత్యువుతో పోరాడుతూ వైద్య విద్యార్థిని ప్రీతి తుది శ్వాస విడవడం అత్యంత బాధాకరమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.