రాష్ట్ర వ్యాప్తంగా 100 ఆరోగ్య కేంద్రాల్లో ప్రారంభం

  • ఆరోగ్య మహిళా కార్యక్రమంలో 57 రకాల వైద్య పరీక్షలు

హైదరాబాద్

ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని మహిళల ఆరోగ్య పరిరక్షణకై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరో విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రకటించారు.రాష్ట్రంలో మహిళా ఆరోగ్య రక్షణకై ‘ఆరోగ్య మహిళ’ ను తెలంగాణ రాష్ట్రంలోని 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆగస్టు 8 వతేదీన ప్రారంభించనున్నారు. ప్రతీ మంగళవారం ప్రాధమిక వైద్య కేంద్రాల్లో మహిళలకు ప్రత్యేకంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అక్కడికక్కడే తగు మందులు ఇవ్వడంతోపాటు అవసరమైన వారిని రెఫరల్ ఆసుపత్రులకు పంపిస్తారు.
రాష్ట్రంలోని 33 జిల్లాల్లోఅన్ని వయస్సుల మహిళలలకు 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ప్రధానంగా ఎనిమిది ప్యాకేజీలుగా విభజియించిన ఈ ఆరోగ్య మహిళా కార్యక్రమంలో డయాగ్నోస్టిక్స్, క్యాన్సర్ స్క్రీనింగ్, సరైన ఆహరం లేకుండా వచ్చే సమస్యలు, మూత్ర సంబంధిత సమస్యలు, మోనోపాజ్ సంబంధిత, కుటుంబ నియంత్రణ, ఇన్ఫర్టిలిటీ, మేస్ట్రువల్ సమస్యలు, సుఖ వ్యాధులు, తక్కువ బరువు ఉన్న సమస్యలకు సంబందించిన వైద్య పరీక్షలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన మొత్తం 20 పాథాలజికల్ లాబ్ లలో నిర్వహిస్తారు. వీటితోపాటు, బీపీ, షుగర్, అనీమియా పరీక్షలను అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఈ పరీక్షల రిపోర్టులను 24 గంటలలోపే అందచేస్తారు.
మహిళలలో క్యాన్సర్ వ్యాధి అవకాశాలు ఎక్కువగా ఉండడంతో, మహిళలలో క్యాన్సర్ వ్యాధికి నిర్దారణ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఆరోగ్య మహిళ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖాన లలో 30 ఏళ్ల పైబడ్డ మహిళలకు బ్రీస్ట్ క్యాన్సర్ నిర్దారణ పరీక్షలు చేపడుతారు. జిల్లా కేంద్రాలు, ప్రాంతీయ ఆసుపత్రులలో మామోగ్రామ్ . కల్పోస్కోపి, క్రియోథెరపి, బయాప్సి, పాప్ స్మియర్ పరీక్షలను నిర్వహిస్తారు. హైదరాబాదులోని నిమ్స్, ఎం.ఎం.జె క్యాన్సర్ ఆసుపత్రుల్లో నిర్దారిత క్యాన్సర్ మహిళలకు చికిత్స అందిస్తారు.
రాష్ట్రంలోని మహిళలకు అయిడిన్ లోపం (థైరాయిడ్ ), విటమిన్ డి-3 , బి-12 తదితర వైద్య పరీక్షలను అవసరం ఉన్నవారికి నిర్వహిస్తారు.

మూత్ర సంబంధిత వ్యాధులను ఎదుర్కునే మహిళలలకు రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలలో ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు. అదేవిధంగా, మోనోపాజ్, బహిష్టు, కుటుంబ నియంత్రణ, సంతాన లేమి తదితర సమస్యలకు కూడా పరీక్షలు నిర్వహించి కౌన్సిలింగ్ చేపడుతారు. అవసరమున్నవారికి ఆల్ట్రా సౌండ్ పరీక్షలకు జిల్లా కేంద్రాలకు రెఫర్ చేస్తారు. సుఖ వ్యాధులు, తక్కువ బరువు తదితర సమస్యలకు కూడా వైద్య పరీక్షలు, కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి గాను ప్రత్యేకంగా ఆరోగ్య మహిళా హెల్ప్ డెస్క్లు కియాస్కి లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద ఏ.ఎన్.ఎం , ఆశా వర్కర్ లతో పాటు పేషంట్ కేర్ కార్యకర్తలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest