లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపీ కుమారుడు అరెస్టు

 

న్యూఢిల్లీ : లిక్కర్ స్కామ్ కేసులో మరొకరు అరెస్టయ్యారు. ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. రాఘవ బాలాజీ గ్రూప్ యజమానిగా ఉన్నారు. ఢిల్లీ ఈడీ ప్రధాన కార్యాలయంలో రాఘవను కొన్నిగంటల పాటు అధికారులు ప్రశ్నించారు. అనంతరం అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. వారం రోజుల్లో ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు ఇద్దరిని అరెస్టు చేయగా సీబీఐ ఒకరిని అరెస్టు చేసింది. ఈ కేసులో ఇటీవలే సీబీఐ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ గోరంట్ల బుచ్చిబాబును అరెస్టు చేసింది. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందని, హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా నిన్న బుచ్చిబాబును ప్రశ్నించిన సీబీఐ అధికారులు.. విచారణ తర్వాత అదుపులోకి తీసుకుంటున్నట్లు ఆయనకు చెప్పారు. అనంతరం బుచ్చిబాబు అరెస్టును అధికారికంగా వెల్లడించారు.

ఈ స్కామ్‌లో ఈడీ మరొకరిని అరెస్టు చేసింది. మద్యం పాలసీ రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన గౌతమ్‌ మల్హోత్రాను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి గౌతమ్‌ మల్హోత్రాను కస్టడీలోకి తీసుకున్నారు. మద్యం వ్యాపారులతో గౌతమ్ మల్హోత్రాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే నేపథ్యంలోనే అతన్ని ఈడీ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఈడీ అధికారులు చారియట్‌ మీడియాకు చెందిన రాజేశ్‌ జోషిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. మద్యం కేసులో నగదును ఒక చోట నుంచి మరోచోటకు తరలించినట్లు రాజేశ్ జోషిపై ఆరోపణలు వచ్చాయి. కస్టడీలోకి తీసుకున్న ఈడీ అధికారులు ఆయన్ను సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు ఈ స్కామ్‌ అనుబంధ ఛార్జిషీట్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌, ఎమ్మెల్సీ కవిత పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ ప్రస్తావించిన విషయం తెలిసిందే. పంజాబ్, గోవా ఎన్నికల ప్రచారం నిధుల కోసమే ఆప్ నేతలు మద్యం కుంభకోణానికి తెరలేపినట్లు ఈడీ పేర్కొంది. కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన ఆప్‌ మీడియా వ్యవహారాల ఇంచార్జి విజయ్ నాయర్ అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడని వెల్లడించింది. విజయ్ నాయర్ ఆదేశాల మేరకు ఇండోస్పిరిట్‌లో 65 శాతం కవిత మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఇచ్చినట్లు వెల్లడించింది. కవిత 3 కోట్ల 40 లక్షలు, మాగుంట 5కోట్లు ఇండో స్పిరిట్‌లో పెట్టుబడి పెట్టినట్లు తెలిపింది. కవిత తరపున అరుణ్‌పిళ్లై, మాగుంట తరపున ప్రేం రాహుల్ ఇండోస్పిరిట్‌లో ప్రతినిధులుగా ఉన్నట్లు ఈడీ వెల్లడించింది. వితతో సమీర్ మహుంద్రు వీడియోకాల్ మాట్లాడటంతో పాటు హైదరాబాద్‌లో కలిశారని చార్జిషీట్‌లో ఈడీ వివరించింది. కవిత ఆదేశాల మేరకు కోటి రూపాయలను అరుణ్ పిళ్లైకి ఇచ్చినట్లు ఆమె అనుచరుడు శ్రీనివాసరావు వాంగ్మూలమిచ్చారని పేర్కొంది. మద్యం వ్యాపారంపై కవిత ఆప్ లీడర్లతో చర్చించారని, సౌత్‌ గ్రూపు ద్వారా వంద కోట్లు ఇచ్చేందుకు డీల్ కుదిరిందని అరుణ్ పిళ్లై చెప్పినట్లు వెల్లడించింది. ఢిల్లీ ఒబెరాయ్ హోటల్‌లో జరిగిన చర్చల్లో కవిత పాల్గొన్నట్లు ఈడీ తెలిపింది. ఇండోస్పిరిట్​కు వచ్చిన లాభాల్లో కోటి 70 లక్షలు మాగుంట గౌతమ్ తీసుకున్నట్లు పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి వివిధ పేర్లతో ఆరు రిటైల్ జోన్లను దక్కించుకున్నట్లు తెలిపింది. కవిత సహా 36 మంది మొబైళ్లు, డిజిటల్ సాక్ష్యాలు ధ్వంసం చేశారని ఈడీ వివరించింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest