హైదరాబాద్ :
వేసవి సెలవులను కొత్త ప్రాంతాల్లో గడపాలనుకుంటున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్. దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం పలు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు ప్రకటించింది. రూట్ వివరాలను, తేదీలను వెల్లడించింది.
సురక్షితమైన, అత్యంత చౌకైన ప్రయాణం అనగానే అందరికి గుర్తొచ్చేది రైలు ప్రయాణం. బస్తో పోల్చుకుంటే రైలులో పేద వారు కూడా నామమాత్రపు ఛార్జీతో ఎక్కడికైనా ఎంచక్కా చుట్టేయచ్చు. అయితే మీరు అందుబాటు టికెట్ ధరలో కోనసీమ అందాలను ఆస్వాదించాలనుకుంటున్నారా
తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారా మీకో శుభవార్త. ఈ వేసవి సెలవుల్లో కొత్త ప్రాంతాల్లో గడపాలనుకున్న వారికి రైల్వేశాఖ తీపి కబురు అందించింది. వేసవి సెలవుల దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
కాచిగూడ-తిరుపతి, తిరుపతి-కాచిగూడ, కాచిగూడ-కాకినాడ టౌన్, కాకినాడటౌన్-కాచిగూడ మధ్య ఈనెల 25, 26, 27, 28 తేదీల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని రైల్వేశాఖ విజ్ఞప్తి చేసింది. వీటితో పాటు వీక్లీ ప్రత్యేక రైళ్లను కూడా నడిపిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
సికింద్రాబాద్-అగర్తలా జూన్ 5 నుంచి జులై 31 వరకు, అగర్తాల-సికింద్రాబాద్ జూన్ 6 నుంచి ఆగస్టు 4 వరు, తిరుపతి-జాల్నా జూన్ 6 నుంచి జులై 25 వరకు, జాల్నా-చప్రా జూన్ 11 నుంచి జులై 30 వరకు, చప్రా-జాల్నా జూన్ 9 నుంచి జులై 28 వరకు, అహ్మదాబాద్-తిరుచురాపల్లి జూన్ 1 నుంచి జూన్ 29 వరకు, తిరుచురపల్లి- అహ్మదాబాద్ జూన్ 4 నుంచి జులై 2 వరకు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
రికార్డు స్థాయి ఆదాయం
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే చరిత్రలోనే మొదటిసారిగా ప్రయాణికుల ఆదాయంలో 5000 కోట్ల రూపాయాల ఆదాయాన్ని ఆర్జించి ఒక ప్రధాన మైలురాయిని సాధించింది. జోన్లో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా 5,000.81 కోట్ల రూపాయలు ఆర్జించింది. ఇది 2019-20లో నమోదైన ఉత్తమ ఆదాయము 4,119.44 కోట్ల రూపాయల కంటే రూ.881,37 కోట్లు అధికం. ఇది గత ఆదాయం కంటే 21% ఎక్కువ. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఎక్కువ సర్వీసులు నడపడం, వివిధ విభాగాల మధ్య సిబ్బంది సమన్వయంతో పాటు సమష్టి కృషి వలన జోన్లోని ప్యాసింజర్ సెగ్మెంట్లో ఈ కొత్త మైలురాయిని చేరుకోవడం సాధ్యమైంది