తానా ద్వారా NTR స్మారక నాణెం

తానా   ద్వారా అమెరికాతో సహా ప్రపంచంలోని వివిధ దేశాలలో ఎన్‌టిఆర్‌ స్మారక నాణెం సులభంగా అందుబాటులో వచ్చేలా ఒక ఒప్పందం జరిగిందని ఎన్ .టి .ఆర్ సెంటినరీ కమిటీ అధ్యక్షులు టి .డి జనార్దన్ తెలిపారు.
సోమవారం రోజు హైద్రాబాద్ లో తానా అధ్యక్షులు శృంగవరపు నిరంజన్‌,
హైదరాబాద్  మింట్‌ సీజీఎం  వి.ననరసింహ  నాయుడు,  జాయింట్‌ డైరెక్టర్‌  గుండపునీడి శ్రీనివాస్‌తో జనార్దన్ ఒక సమావేశం ఏర్పాటు చేశారు.
భారత ప్రభుత్వం ఎన్‌టిఆర్‌ శతజయంతిని పురస్కరించుకొని విడుదల చేసిన ఎన్‌టిఅర్‌ స్మారక నాణెం ఇప్పటికే 25వేలకు పైగా అమ్ముడయ్యాయి. అయితే, అమెరికాతో సహా పలు దేశాలలోని ఎన్‌టిఆర్‌ అభిమానులు తమకు కూడా స్మారక నాణెం  కావాలని కోరుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటయ్యిందని ఆయన చెప్పారు .
తానా అధ్యక్షులు  శృంగవరపు నిరంజన్‌ మాట్లాడుతూ.. అమెరికాలోని  వివిధ నగరాలలో ఉన్న తెలుగువారు ఎన్‌టిఅర్‌ స్మారక నాణెం కావాలని కోరుతున్నారని, వారందరికీ నాణెం సులభంగా లభించడానికి మింట్ అధికారులతో సమావేశమయ్యామని  తెలిపారు. మింట్‌ సీజీఎం నరసింహ  నాయుడు మాట్లాడుతూ.. ఇప్పటికే ఎన్‌టిఆర్‌ స్మారక నాణెన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావటానికి indiagovtmint.in వెబ్ సైట్ ఏర్పాటయ్యిందని  చెప్పారు .  దీని ద్వారా బుక్‌ చేసుకున్న వారికి ఇంటికి పంపిస్తామని చెప్పారు .  మింట్‌ జాయింట్‌ డైరెక్టర్‌ గుండపునేడు  శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఎన్‌టిఆర్‌ స్మారక నాణెనికి వచ్చిన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని తానా వారి సహకారంతో విదేశాలలో వున్నా వారికి కూడా ఈ నాణెం ను పంపించడం జరుగుతుంది అన్నారు .
రాజకీయ విశ్లేషకులు డాక్టర్  పెంటపాటి పుల్లారావు మాట్లాడుతూ..  ఎన్‌టిరామారావు గారి స్మృతులు నిత్యనూతనమని ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని, దేశ సామాజిక రాజకీయ రంగాలపై ఆయన చూపిన ప్రభావం ఎనలేనిదని అందువల్లనే ఎన్‌టిఆర్‌ స్మారక నాణెలకు అంత డిమాండ్‌ ఏర్పడిన దని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అండమాన్‌, నికోబార్‌ అధ్యక్షులు  మాధవనాయుడు మాట్లాడుతూ.. ఎన్‌టిఆర్‌ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటానికి కృషి చేస్తున్న టి.డి.జనార్ధన్‌ అభినందనీయులని పేర్కొన్నారు.
టి.డి. జనార్ధన్‌ మాట్లాడుతూ.. ఎన్‌టిఆర్‌ అనే మూడు అక్షరాలకు ఉన్న శక్తిని వివరించటం ఎవరి వల్ల కాదని, పేదవాడి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడని పేర్కొన్నారు.  అన్న రామారావు గారి స్మారక నాణెం ప్రపంచంలో వున్న తెలుగు తెలుగు వారందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతోనే  సమావేశాన్ని  ఏర్పాటు చేశామని తెలిపారు .
ఈ కార్యక్రమంలో ఎన్‌టిఅర్‌ సెంటినరీ  కమిటీ సభ్యులు దొప్పలపూడి రామ్మోహన్‌రావు, మధుసూదన్‌రాజు,  భగీరథ, విక్రమ్‌పూల,  మండవ సతీష్‌లు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest