పిఠాపురంలో కడప రౌడీలు

పిఠాపురం

పిఠాపురంలో పవన్‌ కల్యాణ్ ఓడించేందుకు ప్రత్యర్థులు కడప నుంచి రౌడీలను దింపుతున్నారంటూ ఆరోపిస్తున్న మెగాబ్రదర్ నాగబాబు.. తాజాగా జనసేన ప్రత్యర్థులకు మరో వార్నింగ్ ఇచ్చారు. సామాన్యులపై కూడా బెదిరింపులు వస్తున్నాయన్న ఆయన ఇలాంటి వారిని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన గీత అనే మహిళకు కడప నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడంటూ ఆయన ఓ ఫోన్ కాల్ రికార్డింగ్‌ను షేర్ చేశారు. ఈ ఆడియోలో.. అవతలి వ్యక్తి.. గీతను పవన్ మాటలు వినొద్దనడం, ఆమె తాను స్వతంత్ర అభ్యర్థిగా వేశానని చెప్పడం వినొచ్చు.

పిఠాపురంలోకి కడప నుంచి గుండాలను దింపుతున్నారనడానికి ఇదో నిదర్శనమని నాగబాబు అన్నారు. ఓ మహిళ పిఠాపురంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేయకూడదా? అని ప్రశ్నించారు. గీత అనే పేరున్న వాళ్లెవరూ పోటీ చేయకూడదా? అని ప్రశ్నించారు. జనసేన అభ్యర్థుల పేర్లున్న డమ్మీ వ్యక్తులతో మీరు పోటీ చేయించలేదా? అని ప్రశ్నించారు. కానీ ఇలాంటి నీచమైన పనులు తాము చేయలేదని అన్నారు. గీత పేరుతో ఉన్న వ్యక్తి నామినేషన్ వేయడం యాదృచ్ఛికమని పేర్కొన్నారు. బెదిరింపులకు దిగేవారి సంగతి తేలుస్తామని నాగబాబు వార్నింగ్ ఇచ్చారు.

‘‘మీరు ఓడిపోయే దశలో ఉన్నారు. అందుకే అతి చేస్తున్నారు. దావూద్ ఇబ్రహీంను తెచ్చినా మేము ధైర్యంగా ఎదుర్కొంటాం. చేతులు కట్టుకుని కూర్చోం. పిఠాపురంలో ఎవ్వరినైనా బెదిరిస్తే గట్టి గుణపాఠం తప్పదు. ఏపీ మీ జాగీరు అనుకుంటున్నారా? పోలీసు బిడ్డలమైన మాకు మీతో ఎలా ఫైట్ చేయాలో తెలుసు. మీరు అడ్డగోలుగా ఫైట్ చేస్తే మేము నేరుగా తలపడతాం. ఇంకోసారి ఇలాంటి బెదిరింపులు వస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి’’ అని నాగబాబు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ వీడియోను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest