శావల్యాపురం
పల్నాడు జిల్లా, శావల్యాపురం ప్రభుత్వ పాఠశాలలో ‘జగనన్న గోరు ముద్ద’ పేరిట అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం తిన్న చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటన మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం చోటు చేసుకుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జె శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా గురువారం సాంబారు బాత్, టమాటా చట్నిని విద్యార్థులకు అందించారు. వీటిని తిన్న విద్యార్థులు 30 నిమిషాల నుంచి గంట వ్యవధిలో కడుపులో నొప్పి, వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. మొత్తం 130 మంది విద్యార్థులు భోజనం చేయగా, 34మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. స్థానిక ఆరోగ్య సిబ్బంది పాఠశాలకు వచ్చి వైద్యం అందజేశారు. వారిలో 23 మంది విద్యార్థులను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపి చికిత్స అందించామని తెలిపారు. వారిలో 8మందికి నీరసంగా ఉండటంతో వారికి సెలైన్, ఇంజెక్షన్లు ఇచ్చి వైద్యం అందడంతో 8మంది విద్యార్థులకు కూడా స్వస్థత చేకూరింది. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు వేమూరి వెంకట భాస్కర్ తెలిపారు