రైల్వేస్టేషన్లను విమానాశ్రయాల్లా తీర్చిదిద్దుతాం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

 

విజయవాడ :

రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రసాద్ పథకంలో భాగంగా అన్నరం, సింహాచలం, నెల్లూరు లక్ష్మీనరసింహ స్వామి ఆలయాలను ఆధునీకరించ నున్నట్లు ఆయన వెల్లడించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏపీ పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ధర్మవరం- విజయవాడ ఎక్స్ ప్రెస్ రైలును మచిలీపట్నం వరకు పొడిగించగా ఆ రైలుకు విజయవాడ రైల్వే స్టేషన్ లో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో వేగంగా కొత్త లైన్లు, ఎలక్ట్రిఫికేషన్, ట్రిప్లింగ్ పనులు చేపడుతున్నట్టు వెల్లడించారు. విజయవాడ రైల్వే స్టేషన్ ను ఎయిర్ పోర్టు మాదిరిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. డీపీఆర్ సిద్ధమయ్యాక విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు షురూ అవుతాయని పేర్కొన్నారు. తిరుపతి-నెల్లూరు రైల్వే స్టేషన్లను అద్భుతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. రాజమండ్రి, గూడూరు వంటి ముఖ్యమైన స్టేషన్లను ఆధునికీకరిస్తామని తెలిపారు. హైదరాబాద్ వచ్చే ఆంధ్రులకు చర్లపల్లి వద్ద రైల్వే టెర్మినల్ నిర్మిస్తామని వివరించారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ రైలు వచ్చే అవకాశం ఉందని కిషన్ రెడ్డి వెల్లడించారు. డిసెంబరులోగా 100 వందేభారత్ రైళ్లు నడపాలని కేంద్రం నిర్ణయించినట్టు పేర్కొన్నారు.

ఏపీలో రైల్వే విభాగానికి బడ్జెట్ లో రూ.8,600 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. షిరిడీ-విజయవాడ ఎక్స్ ప్రెస్ ను మచిలీపట్నం వరకు పొడిగిస్తామని పేర్కొన్నారు. హుబ్లీ-విజయవాడ ఎక్స్ ప్రెస్ రైలును నర్సాపురం వరకు పొడిగిస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. నంద్యాల-కడప ఎక్స్ ప్రెస్ ను రేణిగుంట వరకు పొడిగిస్తామని వివరించారు. విశాఖ-కాచిగూడ రైలును మహబూబ్ నగర్ వరకు… విశాఖ-విజయవాడ ఎక్స్ ప్రెస్ ను గుంటూరు వరకు పొడిగిస్తామని తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest