- హైదరాబాద్ నడిబొడ్డున ఆవిష్కరణ కు సిద్దమవుతున్న అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం.
- 425 మంది సిబ్బంది రేయింబళ్ళు శ్రామిస్తూ పనుల కొనసాగింపు.
- సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి నిరంతర పర్యవేక్షణ
- అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న విగ్రహం ఆవిష్కరణ
- 125 అడుగుల పొడవైన విగ్రహం, 36 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతివనం.
- విగ్రహం కోసం 791 టన్నుల స్టీల్, 96 మెట్రిక్ టన్నుల ఇత్తడి వినియోగం.
హైదరాబాద్:
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సమున్నత శిఖరం తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున కొలువు దీరనుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ స్మృతివనం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్పై బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో 36 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. ఇందులో 2 ఎకరాల విస్తీర్ణంలో అత్యద్భుతంగా కొనసాగుతున్న బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహా నిర్మాణం పనులు చివరి అంకానికి చేరుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం రాష్ట్ర ఎస్సి అభివృద్ధి సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎప్పటికప్పుడు పనులు దగ్గర ఉండి పర్యవేక్షస్తున్నారు. 425 మంది సిబ్బంది రేయింబవళ్ళు నిర్మాణం పనుల్లో నిమగ్నం అయ్యారని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. బుధవారం ఎస్సి అభివృద్ధి సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ విగ్రహం నిర్మాణం పనులు పరిశీలించారు. ప్రధాన విగ్రహంతోపాటు అక్కడ నిర్మిస్తున్న రాక్ గార్డెన్, ల్యాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్, మెయిన్ ఎంట్రన్స్, వాటర్ ఫౌంటెన్, సాండ్ స్టోన్ వర్క్స్, జీఆర్సీ, గ్రానైట్ ఫ్లోరింగ్, లిఫ్ట్, విగ్రహం వద్దకు చేరుకొనే మెట్లదారి, ర్యాంప్, బిల్డింగ్ లోపల ఆడియో విజువల్ రూమ్, ఫాల్స్ సీలింగ్ తదితర పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, వర్క్ ఏజెన్సీతో సమావేశమై పనుల పురోగతిపై చర్చించారు.
125 అడుగుల ఎత్తుతో దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహంగా తెలంగాణకే మణిహారంగా నిలుస్తుందని నిలుస్తుందని మంత్రి చెప్పారు.
విగ్రహం నిర్మాణం కోసం 791 టన్నుల స్టీల్, 96 మెట్రిక్ టన్నుల ఇత్తడిని ఉపయోగిస్తున్నట్లు మరోసారి స్పష్టం చేశారు. అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని..ఏప్రిల్ 10కల్లా నిర్మాణ పనులన్నీ పూర్తి చేసే లక్ష్యంతో సిబ్బంది పనిచేస్తున్నాని వెల్లడించారు. విగ్రహం ఆవిష్కరణపై ఎలాంటి అపోహలు వద్దని మంత్రి చెప్పారు.