హైదరాబాద్ :
ఎమ్మెల్సీ కవిత ఢిల్లీకి బయల్దేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్లారు. ఆమెతో పాటు మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కూడా ఉన్నారు. ఢిల్లీ మద్యం కేసులో ఈనెల 20న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో విచారణకు హాజరవుతారా? లేక గతంలో మాదిరిగా తన న్యాయవాదిని పంపిస్తారా? అనేది ఉత్కంఠగా మారింది. విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేయడంపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఒక మహిళను విచారించేందుకు ఈడీ కార్యాలయానికి పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. తమకు ఇచ్చిన నోటీసుల్లో ఇతరులతో కలిపి విచారిస్తామని చెప్పారని, కానీ అలా చేయలేదని కవిత పేర్కొన్నారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన సీజేఐ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు, తక్షణమే విచారించేందుకు నిరాకరించింది. ఈనెల 24న వాదనలు వింటామని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉండటంతో ఈనెల 16న ఈడీ విచారణకు కవిత హాజరు కాలేదు. దీంతో సుప్రీం తీర్పునకు ముందే మరోసారి వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది.