• తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల కేసులను
• ఒక్క కలం పోటుతో తొలగిస్తాం
• విద్యార్ధులతో మాట ముచ్చట కార్యక్రమంలో
• టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
భూపాలపల్లి
భూపాలపల్లి లోని కేటీకే – 5 ఇంక్లైన్ గని సందర్శన తర్వాత కాశీంపల్లి గ్రామంలో విద్యార్ధులతో నిర్వహించిన మాట ముచ్చట కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్నారు. విద్యార్ధుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ ఉద్యమంలో విద్యార్ధుల పాత్రను వివరించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల కేసులను ఒక్క కలం పోటుతో తొలగిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమం అంటే విద్యార్థుల ఉద్యమం. విద్యార్థులు కేవలం చదువులకే పరిమితం కాకుండా సమాజం కోసం పోరాడారు. మలి దశ తెలంగాణ ఉద్యమం విద్యార్థుల వల్లే ఉవ్వెత్తున ఎగసింది. కేవలం రాజకీయ నాయకుల వల్లే తెలంగాణ ఏర్పడలేదు. విద్యార్థుల త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడింది. ఆడపిల్లల హాస్టళ్లలో మౌళిక వసతులు లేవని ఆడపడుచు గోడు వినిపించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ రాకపోవడం వల్ల సర్టిఫికెట్లు తీసుకునేటపుడు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలని మరో ఆడబిడ్డ చెప్పింది. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని ఆడబిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ అందరితో మాట్లాడాక రాష్ట్రంలో పాలనను కేసీఆర్ గలికొదిలేసారని అర్థమైంది. కేసీఆర్ తెలంగాణ మోడల్ అంటే.. మినిమం గవర్నెన్స్ మాక్సిమం పాలిటిక్స్. దేశం ఆకలి తీర్చేందుకు హరిత విప్లవం తీసుకొచ్చింది కాంగ్రెస్. ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది కాంగ్రెస్. బీడీఎల్, బీహెచ్ఈఎల్, రైల్వే, ఎయిర్ ఇండియా లాంటి సంస్థలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో మినహాయింపు పొందిన పరిశ్రమల్లో కూడా రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. కాంగ్రెస్ అభివృద్ధి చేసిన సంస్థలను మోదీ ప్రయివేటుకు అప్పగించారు. లాభాలు వచ్చే సంస్థలను ప్రయివేటు వ్యక్తులకు తక్కువ ధరకే అమ్మేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. ప్రభుత్వ సంస్థలను ప్రయివేటు పరం చేస్తే.. రిజర్వేషన్లు అమలు జరగదు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో 30 వేల స్కూల్స్ తెరిస్తే… కేసీఆర్ ప్రభుత్వంలో 6,354 సింగిల్ టీచర్ పాఠాశాలలు మూసేశారు. దీంతో మారుమూల ప్రాంతాల విద్యార్థులకు చదువు దూరమైంది. కేసీఆర్ పేదలకు విద్యను దూరం చేసే కుట్ర చేస్తున్నారు. ప్రభుత్వ యూనివర్సిటీలను కేసీఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ప్రయివేటు యూనివర్సిటీలు తెరిచి విద్యను వ్యాపారం చేస్తున్నారు. ప్రయివేటు యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు ఉండవు. బిశ్వాల్ కమిటీ 1,91,354 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పింది. కానీ రిటైర్ మెంట్ వయసు పెంచి ఉద్యోగ ఖాళీలను కేసీఆర్ ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. అధికారంలోకి వచ్చాక అన్ని విద్యా సంస్థల్లో 25శాతం రిజర్వేషన్ ఇచ్చేలా కాంగ్రెస్ విధానం తీసుకొస్తుంది. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేసి తీరతాం. అధికారంలోకి వచ్చాక 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తాం. శాఖల వారీగా ఉద్యోగ క్యాలెండర్ ప్రకారం ఖాళీలు భర్తీ చేస్తాం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల కేసులను ఒక్క కలం పోటుతో తొలగిస్తాం. 10 శాతం పైగా నిధులు విద్య కోసం ఖర్చు చేస్తాం. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి హాస్టళ్లను ఆదర్శంగా తీర్చి దిద్దుతాం. రైతుల కోసం కాంగ్రెస్ ఎంఎస్పీ విధానం తీసుకోస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఆ చట్టానికి తూట్లు పొడిచింది. అధికారంలోకి రాగానే వరంగల్ డిక్లరేషన్ ను అమలు చేసి రైతులను ఆదుకుంటాం. ఇంటికో ఉద్యోగం అంటే కేసీఆర్ దృష్టిలో వాళ్ల ఇంట్లో ఉన్న వాళ్లందరికీ ఉద్యోగాలు ఇచ్చుకునుడు. రాచరికపు పోకడలను ఇంకెంత కాలం భరిద్దాం? విద్యార్థులు పోరాట పటిమను అలవర్చుకోవాలి. మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. విద్యార్థులు అనుకుంటే కేసీఆర్ ను శంకరగిరి మాన్యాలు పట్టిస్తారు. పేదలకు మంచి జరగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి.