పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి : ప్రకటించిన నిమ్స్‌ వైద్యులు

 

హైదరాబాద్‌ :

సీనియర్‌ వేధింపులు తట్టుకోలేక వరంగల్‌ ఎంజీఎంలో  ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆదివారం కన్నుమూసింది. నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు ప్రకటించారు. వైద్య విద్యార్థిని ప్రీతి ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి ఆదివారం మృతిచెందింది. సీనియర్‌ వేధింపులు తట్టుకోలేక వరంగల్‌ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థినికి నిమ్స్‌లో చికిత్స అందించారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో రాత్రి 9.10 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు ప్రకటించారు. కాకతీయ వైద్యకళాశాలలో పీజీ మత్తు వైద్యం (అనస్థీషియా) మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని సీనియర్‌ పీజీ విద్యార్థి సైఫ్‌ కొన్నాళ్లుగా వేధిస్తుండడంతో తాళలేక ఆమె హానికరమైన ఇంజెక్షన్‌ చేసుకుని బలవన్మరణానికి యత్నించారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ప్రీతికి.. తొలుత వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స అందించి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకొచ్చారు. ఆమె ప్రాణాలు కాపాడేందుకు నిమ్స్‌ వైద్యుల బృందం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. మరికొద్దిసేపట్లో ప్రీతి మృతదేహాన్ని అధికారులు అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించనున్నారు. భారీ పోలీసుల బందోబస్తుతో మృతదేహన్ని తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ వివిధ ప్రజా సంఘాల నాయకులు నిమ్స్‌ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. మరో వైపు వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రి, కాకతీయ మెడికల్‌ కాలేజీ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రీతి ఘటనకు కారకుడైన సైఫ్‌ను వారిని శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఆమె స్వగ్రామం జనగామ జిల్లా కొడకొండ్ల మండలం గిర్నితండాలో గ్రామస్థులు ఆందోళనకు దిగారు. కేఎంసీ ప్రిన్సిపల్‌, హెచ్‌వోడీలపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

నా మనసును తీవ్రంగా కలిచి వేసింది: హరీశ్‌రావు

మృత్యువుతో పోరాడుతూ డాక్టర్ ప్రీతి తుది శ్వాస విడవడం అత్యంత బాధాకరం. ఆమెను కాపాడేందుకు నిమ్స్ వైద్య బృందం నిర్విరామంగా, శక్తి వంచన లేకుండా శ్రమించింది. పూర్తి అరోగ్యవంతురాలై వస్తుందని అనుకున్న డాక్టర్ ప్రీతి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం నా మనసును తీవ్రంగా కలిచి వేసింది. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది’’ అని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

వైద్య విద్యార్థిని ప్రీతి ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి : ఈటల రాజేందర్‌

హైదరాబాద్‌ :

నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి గురించి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి వెళ్లిన ఈటల అక్కడ మీడియాతో మాట్లాడారు. వరంగల్‌ కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్‌ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రీతికి మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఆదివారం నిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లిన ఈటల ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో నిగూఢంగా ఇంకా ర్యాగింగ్‌ కొనసాగుతోంది. మెడికల్‌ కాలేజీల్లో పీజీ చదివే అమ్మాయిల మీద సీనియర్లు వేధింపులకు గురిచేస్తున్నారని ప్రీతి ఘటనతో స్పష్టమైంది. ఇలాంటి ఘటనలు వెలుగుచూసినప్పుడు హెచ్‌వోడీలే చర్యలు తీసుకోవాలి. ప్రీతి విషయంలో సకాలంలో హెచ్‌వోడీ స్పందించి చర్యలు తీసుకుని ఉంటే ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకునేదికాదు. చివరకు ప్రిన్సిపల్‌ దగ్గరికి వెళ్లి ఆమె గోడు వెళ్లబోసుకున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. ఈ ఘటనపై ప్రీతి తండ్రి పోలీసులకు చెప్పినా ప్రయోజనం లేకపోయింది. ఇక్కడ అన్నీ వ్యవస్థలు విఫలమయ్యాయని అర్థమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణ జరిపించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈటల డిమాండ్‌ చేశారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై ఆమెకు చికిత్స అందిస్తున్నామని నిమ్స్‌ వైద్యులు తెలిపారు.

గంగుల సంతాప ప్రకటన
మెడికో ప్రీతి మృతి బాధాకరం, ప్రీతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.

మెడికో ప్రీతి మృత్యువుతో పోరాడి మరణించిన ఘటన దురదృష్టకరమని, వైద్యుల ప్రయత్నాలు విఫలమవడం బాద కలిగిస్తుందన్నారు మంత్రి గంగుల కమలాకర్, ప్రీతి మరణం పట్ల నివాళులు అర్పించిన మంత్రి తన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

నా కుమార్తె బతుకుతుందనే ఆశలు వదిలేసుకున్నాం : ప్రీతి తండ్రి నరేంద్ర

హైదరాబాద్‌:

వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నప్పటికీ తమ కుమార్తె బతుకుతుందనే ఆశలు కనిపించడం లేదని ప్రీతి తండ్రి నరేంద్ర వాపోయారు. వరంగల్‌ కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి మొదటి రోజుతో పోలిస్తే మరింత క్షీణించిందని ఆమె తండ్రి నరేంద్ర తెలిపారు. నిమ్స్‌ వద్ద ఆదివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నప్పటికీ తమ కుమార్తె బతుకుతుందనే ఆశలు కనిపించడం లేదని వాపోయారు. ప్రీతి శరీరం రంగు కూడా మారిపోతోందన్నారు. వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తారని ఆశించినప్పటికీ అలాంటి పరిస్థితి కనిపించలేదన్నారు. ఏదైనా అద్భుతం జరుగుతుందేమోనని ఆశించాం. కానీ, ఆశలు వదిలేసుకున్నాం. ప్రీతి ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. బతికే అవకాశాలు లేవని వైద్యులు కూడా చెప్పారని వెల్లడించారు. ఆదివారం పలువురు రాజకీయ నేతలు నిమ్స్‌ ఆసుపత్రికి వచ్చి ప్రీతి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ప్రీతి తల్లిదండ్రులను పరామర్శించిన వారిలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌, ఎంపీ మాలోతు కవిత తదితరులు ఉన్నారు. మరో వైపు ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ నిమ్స్‌లో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. వైద్య విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం రూ.5కోట్ల పరిహారం ఇవ్వాలని, ప్రిన్సిపల్‌, హెచ్‌వోడీలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశాయి.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest