- తెలంగాణ రాష్ట్రంలో మహిళా సాధికారత, రక్షణ, ఆరోగ్యం, విద్యకు ప్రాధాన్యం పట్ల హర్షం
- తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అభినందించిన ఆస్ట్రేలియా మహిళ ప్రతినిధుల బృందం
- మాది మహిళా పక్షపాత ప్రభుత్వం. మంత్రి సత్యవతి రాథోడ్
హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేశారని, మాది మహిళా పక్షపాత ప్రభుత్వమని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో ఆస్ట్రేలియా మహిళా ప్రతినిధుల బృందం మంత్రి సత్యవతి రాథోడ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు సాధించిన అభివృద్ధిని వారు అభినందించారు. నీలిమా చౌదరి నేతృత్వంలోని మహిళ ప్రతినిధి బృందం త్వరలో మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి ఒక ప్రతిపాదనను అందజేస్తామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా సాధికారత, ఆరోగ్యం, విద్య మరియు అట్టడుగు వర్గాల్లోని వయోజన మహిళలకు నైపుణ్యం కల్పించి, వారిని ఆర్థికంగా స్వతంత్రులుగా మరియు స్వావలంబనగా మార్చడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. మహిళల సంక్షేమం కోసం ఇంతలా కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి సత్యవతి రాథోడ్ తో కలసి తాము పనిచేయాలని కోరుకుంటున్నట్లు ఆస్ట్రేలియన్ మహిళ ప్రతినిధుల బృందం తెలిపారు. అందుకు అనుకూలంగా స్పందించిన మంత్రి సత్యవతి , దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలో మహిళ విద్యపైనే కాకుండా, వారి ఆరోగ్యం, రక్షణ, పోషణ, ఆర్థిక స్వావలంబన, రాజకీయ స్వతంత్రత కోసం ప్రభుత్వం వివిధ పథకాలు ప్రవేశపెట్టిందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, పిల్లల సంరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోని అగ్రగామిగా నిలించిందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు పౌష్టిక ఆహారం అందించడానికి 35700 అంగన్వాడి కేంద్రాల ద్వారా 2015 జనవరి నుండి ఆరోగ్యలక్ష్మి పథకం క్రింద పోషక ఆహారాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. గర్భిణీలకు కెసిఆర్ న్యూట్రిషన్ కిట్, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కెసిఆర్ కిట్ అందజేస్తున్నామన్నారు. అనంతరం ఆస్ట్రేలియన్ మహిళా ప్రతినిధుల బృందం ఈసందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ కి జ్ఞాపికను అందజేశారు.
మంత్రిని కలిసిన వారిలో రిపబ్లిక్ ఆఫ్ జింబాబ్వే ఆసియా పసిఫిక్ వాణిజ్య కమిషనర్ నీలిమా చౌదరి, మరియు VC ఇండియా ఫెలో & నేషనల్ చైర్ ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ జోడి మెక్కే, మరియు వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ డిప్యూటీ వైస్-ఛాన్సలర్ మరియు వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డెబోరా స్వీనీ తో పాటు బీఆర్ఎస్ నాయకులు గూగులొతు శ్రీరామ్ నాయక్ తదితరులు ఉన్నారు.