TSPSC Paper Leak case ఆంధ్రా అధికారి చేతిలో తాళాలా?

  • పేపర్ లీకు కేసులో కేటీఆర్ పెద్ద తలల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు
  • కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి
  • టీఎస్పీఎస్సీ పరీక్ష నిర్వహణను అపహాస్యం చేశారు
  • టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

హైదరాబాద్

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో  జరిగిన నేరాన్ని ఇద్దరికే పరిమితం చేసి కేటీఆర్ పెద్ద తలల్ని కాపాడే ప్రయత్నం చేశారు అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. పేపర్ల లీకు కేసులో సిట్ నోటీసులకు అనుగుణంగా గురువారం విచారణకు హాజరైన తర్వాత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించింది విద్యార్థులు, నిరుద్యోగులని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిందే నిరుద్యోగులని ఆయన చెప్పారు. టీఎస్పీఎస్సీ హిందువులకు దేవాలయం, ముస్లింలకు మసీదు, సిక్కులకు గురుద్వార లాంటిదన్నారు. తెలంగాణలో టీఎస్పీఎస్సీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని, నియామకాలు లోపభూయిష్ఠంగా జరిగాయని ఆరోపించారు. ప్రశ్నాపత్రం లీకేజీని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని, పార్టీని విస్తరించుకువడంపైనే బీఆరెస్ ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఎద్దేవా చేశారు. టీఎస్పీఎస్సీ పై నిరుద్యోగులకు విశ్వాసం కలిగించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు. పేపర్ లేక్ వ్యవహారంలో పూర్తి బాధ్యత మంత్రి కేటీఆర్ దే అన్నారు. కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ పరీక్ష నిర్వహణను ఏ ప్రభుత్వం పూర్తిగా అపహాస్యం చేసిందని ఆరోపంచారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజశేఖర్ రెడ్డి, కేటీఆర్ పీఏ తిరుపతికి పేపర్ లీకేజ్ లో కీలక భాగస్వామ్యం ఉందని రేవంత్ ఆరోపించారు. వంద మందికి పైగా 100 మార్కులు వచ్చాయని గతంలో తాము చెబితే… వారిని విచారించాల్సింది పోయి సిట్ ద్వారా నోటీసులిచ్చి ప్రభుత్వం మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేసిందని విమర్శించారు. అయినా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అధికారులకు పూర్తి వివరాలను వివరించామన్నారు. తమ వద్ద ఉన్న సమాచారాన్ని, వివరాలను సిట్ అధికారి ఏఆర్ శ్రీనివాస్ కు అందించామని తెలిపారు. పేపర్ లీకేజీ పై తాను, బండి సంజయ్, కేటీఆర్ ముగ్గురం స్పందించమని, అయితే సిట్ కాంగ్రెస్, బీజేపీ అధ్యక్షులకు మాత్రమే నోటీసులిచ్చి కేటీఆర్ కు నోటీసులు ఇవ్వలేదని చెప్పారు. అంటే తమను భయపెట్టేందుకె అధికారులతో ప్రభుత్వం ఈ పని చేయించినట్లు తెలుస్తోందన్నారు. అందుకే కేటీఆర్ వ్యాఖ్యల వివరాలను సిట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, కేటీఆర్ కు నోటీసులిచ్చి విచారణ చేస్తే అసలు నేరస్తులు బయటపడతారన్నారు. సిట్ విచారణ చేయకుండానే కేటీఆర్ నేరం ఎలా జరిగిందో తెలంగాణ సమాజానికి వివరించారని, ఇంత చేసిన కేటీఆర్ వ్యాఖ్యలు సిట్ అధికారులు తమ దృష్టికి రాలేదనడంలో అంతర్యమేంటని ప్రశ్నించారు. కేటీఆర్ పై ఫిర్యాదు తీసుకోమని, కేవలం సమాచారం మాత్రమే తీసుకుంటామని అధికారులు చెప్పారని రేవంత్ తెలిపారు.

కెటీఆర్, జనార్దన్ రెడ్డి, అనితా రామచంద్రన్ ను విచారణ చేయాల్సిందేనని సిట్ అధికారులకు స్పష్టం చేశామని తెలిపారు రేవంత్ రెడ్డి. రాజకీయ ఒత్తిడులకు అతీతంగా విచారణ చేయాలని కోరామన్నారు. ఈ నెల 24, 25న ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ నిరసన దీక్ష కార్యక్రమం ఉంటుందని, 25న సాయంత్రం కాకతీయ యూనివర్సిటీలో కూడా నిరసన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం, టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసి విచారణ చేయడం, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలనే మూడు నిర్దిష్టమైన డిమాండ్ల తో భవిష్యత్ కార్యాచరణతో ముందుకెళతామని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇచ్చిన నోటిఫికేషన్లు, క్వాలిఫై అయిన వారి, ఉద్యోగాలు వచ్చిన వారి వివరాలు వెబ్ సైట్ లో ఉంచేలా చూడాలని అధికారులను కోరామని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఆంధ్రా అధికారి చేతిలో తాళాలా?

30 లక్షల తెలంగాణ నిరుద్యోగుల భవిష్యత్ ఆంధ్రా వాళ్లే నిర్ణయిస్తున్నారని, రాష్ట్రం వచ్చినా ఆంధ్రా అధికారుల చేతిలోనే తాళాలు ఎందుకు ఉన్నాయి? అని రేవంత్ ప్రశ్నించారు. ఇంత పెద్ద వ్యవస్థకు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ హోదా ఉన్న ఒక్క తెలంగాణ బిడ్డ లేడా కేసీఆర్? తెలంగాణ బిడ్డల త్యాగాలను కేసీఆర్ అపహాస్యం చేశారని విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగుల కోసం ఎన్ని అవమానాలైనా, ఎన్ని కేసులైనా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. తెలంగాణకు పట్టిన చీడ, పీడ కేసీఆర్ కుటుంబమేనని…ఆ చీడ, పీడను వదిలించే వరకు తమ పోరాటం ఆగదన్నారు. 30 లక్షల మంది ఉసురు ఉప్పెనై కేసీఆర్ కుటుంబాన్ని కప్పేసే రోజు దగ్గరలోనే ఉందని తెలిపారు రేవంత్.

కాలినడకన సిట్ కార్యాలయానికి

సిట్ నోటీసుల నేపథ్యంలో ఆధారాలు సమర్పించడానికి కాంగ్రెస్ నేతలతో కలిసి సిట్ కార్యాలయానికి తన నివాసం నుంచి బయలుదేరిన రేవంత్ రెడ్డి వాహన శ్రేణిని నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించారు. బంజారాహిల్స్ తాజ్ కృష్ణ వద్ద రేవంత్ వాహనం మినహా మిగతా వాహనాలను వెళ్ళనివ్వకుండా ట్రాఫిక్ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ వాహనాలను అనుమతించకసిందేనని రేవంత్ వారించడంతో పోలీసులు వాహనాలను అనుమతించారు. లిబర్టీ చౌరస్తాకు చేరుకోగానే.. రేవంత్ వాహనం మినహా ఇతర అవహనాలు వెళ్లకూడదని పోలీసులు తేల్చి చెప్పారు. పోలీసులతో కాసేపు వాగ్వాదానికి దిగిన రేవంత్.. ఆతరువాత కారు దిగి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కాలినడకన సిట్ కార్యాలయానికి చేరుకుని ఆధారాలు సమర్పించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest