- ఉన్నత స్థాయిలో ఉన్న బాధ్యులను విధుల నుండి తప్పించాలి
- అవసరమైతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ రీగ్జామినేషన్
- లక్షలాది నిరుద్యోగులలో ఆందోళనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి
- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్
హైదరాబాద్ :
టి ఎస్ పిఎస్ సి లో పేపర్ లీకేజీ వ్యవహారంలో కేవలం ఉద్యోగులపైనే కాకుండా ఉన్నత స్థాయిలో ఉన్న బాధ్యలను కూడా విధుల నుండి తప్పించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షా పత్రం లీకేజీ పై వస్తున్న వార్తలను కూడా లోతుగా పరిశీలించాలని, అవసరమైతే సాధ్యమైనంత త్వరగా ఉద్యోగార్థులకు న్యాయం చేయాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో నియామకాలు కీలకమైన నినాదమని, వివిధ కారణాల కారణంగా ఆలస్యమై ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఊపందుకున్నదన్నారు. ఇలాంటి సమయంలో లీకేజీ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఉద్యోగాల గురించి ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తూ , లక్షలు ఖర్చు చేసి, హాస్టల్స్ ఉంటూ సిద్ధమవుతున్న నిరుద్యోగులలో తీవ్ర ఆందోళన నెలకొన్నదన్నారు. గ్రూప్ 1 పరీక్ష పత్రాలు కూడా లీక్ అయ్యాయనే అనుమానాలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నదని పేర్కొన్నారు. ఇంతటి తీవ్రమైన అంశంపై ప్రభుత్వం స్పందించి, మొత్తం , వాస్తవాలను వెలికితీయడం కోసం సిట్టింగ్ జడ్జితో విచారణకు కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు.